ఒకేసారి టెన్త్ పాసైన తల్లీకొడుకు... వీడియో పంచుకున్న నారా లోకేష్

  • పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసైన తల్లీకొడుకు
  • వారిని అభినందిస్తూ పోస్ట్ పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేశ్
  • లక్ష్మీ లహరి ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ మంత్రి ప్రశంస
  • ఓపెన్ స్కూల్ ద్వారా పట్టుదలతో చదివిన గృహిణి లక్ష్మీ లహరి
చదువుకు వయసు అడ్డుకాదని నిరూపిస్తూ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ తల్లి ఆచరణలో చూపించారు. తన కుమారుడితో పాటు పదో తరగతి పరీక్షలు రాసి, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులై అందరికీ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఈ తల్లీకొడుకుల విజయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, అభినందనలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి గృహిణి. చదువుకోవాలనే బలమైన ఆకాంక్షతో ఆమె ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిలో చేరారు. అదే సమయంలో ఆమె కుమారుడు విజయ్ కూడా టెన్త్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. నిన్న విడుదలైన ఫలితాల్లో తల్లి లక్ష్మీ లహరి 360 మార్కులతో, కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తల్లీకొడుకులు ఆనందంతో ఒకరినొకరు అభినందించుకుంటున్న వీడియోను పంచుకున్నారు. "ఒకేసారి టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసైన తల్లీకొడుకు ఆనందానుభూతి మాటల్లో వర్ణించలేనిది. చిన్న కారణాలతో చదువు ఆపేసిన వారు లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. తల్లికి అభినందనలు, కుమారుడు విజయ్‌కి ఆశీస్సులు తెలిపారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల స్ఫూర్తిదాయక విజయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mother and Son
10th Class
Nara Lokesh
West Godavari
Andhra Pradesh

More Telugu News